ఐపీఎల్ ట్రేడింగ్‌లో బిగ్ డీల్... జట్లను మారిన స్టార్ ఆటగాళ్లు!

  • ఐపీఎల్‌లో సంచలన ట్రేడింగ్‌ డీల్
  • చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మారిన సంజూ శాంసన్
  • రాజస్థాన్ రాయల్స్‌కు రవీంద్ర జడేజా, శామ్ కరన్
  • బీసీసీఐ ఆమోదంతో పూర్తయిన ఒప్పందం
  • ధోనీతో చర్చించాకే నిర్ణయం తీసుకున్న జడేజా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిటెన్షన్ గడువుకు కొన్ని గంటల ముందు సంచలనం చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) కెప్టెన్ సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకుంది. ఈ భారీ ఒప్పందంలో భాగంగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్‌లను రాజస్థాన్ రాయల్స్ తమ జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు క్రిక్‌బజ్ తన కథనంలో వెల్లడించింది.

వాస్తవానికి ఈ ట్రేడింగ్ ప్రక్రియకు మొదట సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి. రాజస్థాన్ జట్టులో ఓవర్సీస్ స్లాట్ అందుబాటులో లేకపోవడంతో డీల్ నిలిచిపోయింది. అయితే, బీసీసీఐ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒప్పందం పూర్తయింది. ఈ రోజు దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత మూడేళ్లుగా సంజూ శాంసన్‌ను దక్కించుకోవడానికి సీఎస్‌కే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఈ డీల్‌పై ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిని రాజస్థాన్‌కు దక్కిన "స్వీట్‌హార్ట్ డీల్" అని అభివర్ణించారు. "ధోనీ రిటైర్మెంట్ దశలో ఉన్నప్పుడు, జడేజా లాంటి స్టార్ ఆటగాడిని సీఎస్‌కే ఇంత తేలికగా వదులుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ధోనీ తర్వాత సీఎస్‌కేకు ప్రతినిధిగా జడేజా ఉన్నాడు. ఇప్పుడు జట్టుకు ముఖచిత్రం ఎవరు?" అని ఆయన ప్రశ్నించారు.

అయితే, ఈ ట్రేడింగ్ ప్రక్రియకు ముందు రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీతో చర్చించినట్లు తెలుస్తోంది. అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇద్దరూ అంగీకారానికి వచ్చినట్లు ఆ కథనం పేర్కొంది. మరోవైపు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర వంటి పలువురు ఆటగాళ్లను కూడా సీఎస్‌కే వదులుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.



IPL Trading
Sanju Samson
Rajasthan Royals
Chennai Super Kings
Ravindra Jadeja
Sam Curran
MS Dhoni
IPL 2024
Indian Premier League
Cricket

More Telugu News